+91 7731881113
info@epoojastore.com

శ్రీ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామి – జగన్నాథగిరి

మృగశిర నక్షత్రం – 4వ పాదంjagannadagiri

ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిలో జగన్నాథగిరి గ్రామపు బస్సుస్టాపునకు అతి సమీపమున కలదు. ప్రధాన రహదారిలో ఉండుట వలన ఇటు కాకినాడ నుండి అటు ద్రాక్షారామ నుండి విశేషమైన రవాణా సౌకర్యం కలదు. ఈ క్షేత్రము మృగశిర నక్షత్రము నాలుగవ పాదమునకు చెందినది.

ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శివస్వరూపానికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించడం ద్వారా విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రము అతి పురాతనమైనను దురదృష్టవశాన ఆలయము అందలి శివలింగము శిథిలమై ఉండుట చేత సుమారు 90 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ పెండ్యాల చలపతిరావు అను పుణ్యాత్ముడు ప్రస్తుతం ఉన్న శివలింగాన్ని కాశీక్షేత్రము నుండి తీసుకుని వచ్చి ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.

ఈ ఆలయమున సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ మంటపము, స్వామి అయ్యప్ప మరియు ఆంజనేయస్వామి ఉపాలయములు కలవు. వీటితో పాటు గ్రామ శివారున కొలువైయున్న గ్రామదేవత పనుగుదులమ్మ ఆలయము కూడా పురాతనమైనది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇదికాక సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. అంతేకాక అయ్యప్ప మాలాధారణలు, హనుమత్ జయంతి, హనుమత్ వ్రతము ఈ ఆలయాన ప్రసిద్ధి.