ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రమైన వెంటూరుకు సమీపాన కలదు. బస్సు సౌకర్యం కూడా కలదు. ఈ క్షేత్రము జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల శుభ ఫలితములు కలుగునని భక్తుల విశ్వాసము. చోళరాజుల కాలంనాటి ఈ ప్రసిద్ధ ఆలయము పెద్దాపురం సంస్థానాధీశులచే 1919వ సంవత్సరంలో పునరుద్ధరించబడినది. తిరిగి 1990 ప్రాంతంలో ముఖమంటపం నిర్మించబడ్డది.
ఈ ఆలయ ప్రాంగణంలో రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం మరియు కోదండరామాలయం కలవు. గ్రామంలో సాయిబాబావారి ఆలయం కూడా కలదు. స్వామివారి కళ్యాణోత్సవము చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శివకల్యాణంతో పాటే వేణుగోపాలస్వామివారి కల్యాణం కూడా నిర్వహించబడడం ఈ క్షేత్రంలోని విశేషం. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా నిర్వహించబడతాయి. కొదందస్వామి కల్యాణం మరియు నవరాత్రులు కూడా ఈ ప్రాంగణంలోని రామాలయంలో వైభవోపేతంగా నిర్వహించబడతాయి.