info@bheemasabha.com

శ్రీ మీనాక్షీదేవి సమేత నీలకంఠేశ్వరస్వామి – నీలపల్లి

కృత్తిక నక్షత్రం – ప్రథమ చరణంneelapalli

ఈ క్షేత్రము కాకినాడ – యానాం ప్రధాన రహదారిపై కలదు. ఆలయమునకు చేరుటకు నీలపల్లి బస్సుస్టాపు వద్ద దిగి లోనికి వెళ్ళవలెను.ఈ క్షేత్రము కృత్తిక నక్షత్రం మొదటి పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శివమూర్తిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించినచో వారికి అరిష్ట నివృత్తి జరిగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము. ఈ గ్రామము యొక్క నామధేయము కూడా క్షేత్ర స్థిత నీలకంఠేశ్వరస్వామి పేరుమీద నీలపల్లి అయినట్లు ఒక కథనం.

ప్రస్తుతం ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నది. ఆలయమందలి మూలమూర్తులను ఒక ప్రక్కగా తాత్కాలిక మందిరమందు ప్రతిష్టించిరి. జీర్ణమైన పూర్వాలయము 500 సంవత్సరముల క్రితం నిర్మించబడెనని తెలియుచున్నది. ఈ ఆలయమును జేర్చి విశాల ప్రాంగణంలో శ్రీ సీతారామస్వామివారు మరియు శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కొలువై వున్నారు. ఈ ఆలయ ప్రాంగణమునకు శ్రీసీతారామ సమేత వెంకటేశ్వర ఆలయముగా నామకరణం జరగడం విశేషం. శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. ఈ క్షేత్రమునందు శరన్నవరాత్రులు, మరియు సుబ్రహ్మణ్యషష్ఠి తీర్థము విశేషంగా నిర్వహించబడును.