ఈ క్షేత్రం కాకినాడ నుండి యానాం మార్గంలో కలదు. తాళ్ళరేవు మండల కార్యాలయం దాటి అరకిలోమీటరులోపు రహదారికి కుడివైపు ఆలయమునకు మార్గము చూపుతూ సిమెంటు ఫలకం ఉండును. ఈ క్షేత్రము భీమమండలమునందు కలదు. నక్షత్ర శివాలయములలో ఈ ఆలయం మృగశిర నక్షత్రము – ప్రథమ చరణమునకు సంబంధించినదిగా భావింప బడుచున్నది.
ఆ జన్మనక్షత్రమున జన్మించినవారు ఈ క్షేత్ర దర్శనం, అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల సత్ఫలితాలు కలుగగలవని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఉన్న ఆలయనిర్మాణం క్రీ.శ. 1737వ సంవత్సరంలో శ్రీయుతులు దినవాహి వీర్రాజుగారిచే నిర్మించబడినట్లు అక్కడి శిలాశాసనం ద్వారా తెలియుచున్నది.