ఈ క్షేత్రము వేళంగి సమీపంలో కలదు. వేళంగి నుండి సంపరవైపు వెళ్ళు మార్గంలో కాండ్రేగుల గ్రామమునకు ముందు గలదు. ఈ క్షేత్రము చేరుటకు రోడ్డు రవాణా సంస్థ వాహనములే కాక ప్రైవేటు వాహనము (ఆటో)ల సౌకర్యం కూడా కలదు. ఈ క్షేత్రము ఆరుద్ర నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు కూరాడ నందు కొలువైయున్న వీరభద్రస్వామి వారిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన యెడల శుభాఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము. ఈ ఆలయము సుమారు రెండువందల సంవత్సరముల క్రితం నిర్మితమైనట్లు తెలియుచున్నది.
ఈ గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయము, వెంకటేశ్వరస్వామివారి ఆలయము, సంజీవ ఆంజనేయస్వామి ఆలయము, గ్రామదేవత అన్నాపరమ్మ ఆలయము మరియు గ్రామశివారులో పోతురాజు గుడి కలవు. స్వామివారి కళ్యాణోత్సవము వైఖాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది .అంతేకాక ఇక్కడ సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాలు కూడా విశేషంగా నిర్వహించబడతాయి. ముఖ్యంగా పోతురాజు ఉత్సవాలు ఇక్కడ అత్యంత విశేషంగా జరుపబడతాయి. చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి ఈ ఉత్సవం తిలకించడానికి అనేకమంది భక్తులు తరలివస్తారు.