కుయ్యేరు క్షేత్రమును చేరుటకు కాకినాడ, యానాం, ద్రాక్షారామల నుండి కూడా విస్తృతమైన రవాణా సౌకర్యం కలదు. అంతేకాక ఈ ఆలయము ప్రధాన రహదారిపై ఉండుట చేత చేరుట అతిసులభం. ఈ క్షేత్రము అశ్వని నక్షత్రము మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మల్లేశ్వరస్వామిని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన శుభ ఫలితములు కలుగునని భక్తుల విశ్వాసము. అత్యంత పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం సుమారు రెండువందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు తెలుస్తున్నది. అయితే ఆలయం జీర్ణావస్థలోకి వచ్చిన కారణం చేత గ్రామస్థుల సహకారంతో పునఃనిర్మాణం చేపట్టడం జరుగుచున్నది.
అలాగే శివలింగం కూడా కాశీ క్షేత్రము నుండి తీసుకుని వస్తున్నట్లు తెలిసినది. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఈ ఆలయం 08-03-2015 నుండి పునఃప్రతిష్ఠతో సహా ప్రారంభం కానున్నట్లు తెలిసినది. ఈ గ్రామంలో రుక్మిణీ సత్యభామా సమేత శ్రీమదనగోపాలస్వామి వారి ఆలయం మరియు శ్రీ సీతారామస్వామివారి ఆలయము కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇదికాక ఈ క్షేత్రములో శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా నిర్వహించబడును. అంతేకాక మాసోత్సవములు ఆయనోత్సవములు జరుగును.