info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి – అండ్రంగి

మృగశిర నక్షత్రం – తృతీయ చరణంAndrangi

ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రమైన పెనుమళ్ళ గ్రామానికి అతి సమీపమున గలదు. కాకినాడ నుండి ద్రాక్షారామ నుండి రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం కలదు. అలాగే యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని ఎర్రపోతవరం జంక్షన్ నుండి ప్రయివేటు వాహనము (ఆటో) ద్వారా గాని స్వంత వాహనముల ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము మిధునరాశి యందలి మృగశిర నక్షత్రం మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులకు ఈ ఆలయ స్థిత శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి అర్చన, అభిషేకములచే విశేష ఫలములు లభించగలవని భక్తుల విశ్వాసము. అత్యంత పురాతన క్షేత్రములలో ఒకటైన ఈ ఆలయమునకు విశేష స్థల పురాణం కలదు.

పూర్వము నారద మహర్షి విష్ణుమాయను జయించుట కొరకు పీఠికాపురము నుండి ద్రాక్షారామమునకు వచ్చు క్రమములో మార్గమధ్యాన ఈ క్షేత్రము వద్ద బస చేసి ఈ క్షేత్ర సమీపాన వున్న తటాకమందలి జలముతో మల్లేశ్వరస్వామివారికి ఆర్ఘ్యపార్ష్యాదులు సమర్పించినారట. ఆ కారణము చేత స్వామి పుష్కరిణికి నారదగుండమని నామధేయము కలిగినది.

ఈ ఆలయము 1988వ సంవత్సరంలో పునరుద్ధరించబడినది. ఈ ఆలయమందలి కళ్యాణమంటపము 1976వ సంవత్సరంలో నిర్మించబడినట్లుగా అక్కడి శిలాఫలకము ద్వారా తెలియుచున్నది. ఈ ఆలయమందు సుబ్రహ్మణ్యస్వామి మరియు చండీశ్వరుల ఉపాలయములతో పాటు శివకోటి స్థూపం కలదు. ఈ గ్రామమందు పురాతన కుంతీ మాధవస్వామివారి ఆలయము మరియు కోదండరామాలయము కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. మరియు శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి కూడా వైభవంగా నిర్వహించబడును.