ఈ క్షేత్రము యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారిపై కలదు. రోడ్డు రవాణా సంస్థ వారి బస్సు సదుపాయం విశేషముగా ఉన్నందువలన ఈ క్షేత్రము చేరుట సులభము. బస్సు స్టాపు నుండి ఆలయము అతి సమీపమున ఉన్నందువల్ల ఇబ్బంది వుండదు. పూర్వాభాద్ర నక్షత్రము నాలుగవ పాదంలో జన్మించినవారు ఈ ఆలయస్థితి శ్రీ పార్వతీ సమేత మల్లిఖార్జున స్వామివారిని భక్తిశ్రద్ధలతో అర్చించిన యెడల శుభ ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.
సుమారు 200 సంవత్సరముల చరిత్ర గల ఈ ఆలయము 2003వ సంవత్సరంలో పునరుద్ధరించబడి శాస్త్రోక్తముగా మూలమూర్తుల పునఃప్రతిష్ఠ జరిగినది.ఈ ఆలయ ప్రాకారకుడ్యములపై పలు దేవతా మూర్తుల చిత్రములు సుందరముగా చిత్రించబడి భక్తజనులకు కన్నుల పండుగ చేయును. ఈ ఆలయ ప్రాకారమునందే రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం వుండడం విశేషం. చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా స్వామివారి దివ్య కళ్యాణోత్సవము నిర్వహించబడును. అంతేకాక శరన్నవరాత్రులు కూడా ఈ క్షేత్రమున అత్యంత వైభవోపేతంగా జరుగును.