ఈ క్షేత్రము చింతలూరుకు అతి సమీపంలో కలదు. మండపేట, ఆలమూరు మధ్య పెదపళ్ళ గ్రామం నుండి ఈ క్షేత్రమును చేరవచ్చును. పినపళ్ళ గ్రామం రహదారి వరకు బస్సు సౌకర్యం కలదు. అయితే పెదపళ్ళ నుండి ఆటో ద్వారా ఈ ఆలయమును చేరుట సులభము. అనూరాధ నక్షత్రం మూడవ పాదమునకు చెందిన ఈ క్షేత్ర దర్శనము మరియు అర్చనాభిషేకముల వలన ఈ జాతకులకు విశేష ఫలము సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసము.
మార్కండేయమహర్షి ప్రతిష్టగా చెప్పబడుతున్న ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు తెలియుచున్నది. సుమారు 25సంవత్సరముల క్రితం పునరుద్ధరించబడినది. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అంతరాలయంలో కొలువైవున్నారు. గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం మరియు రామాలయం కలవు. స్వామివారి కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా నిర్వహించబడతాయి.