అంగర గ్రామము చేరుటకు మండపేట మరియు కె. గంగవరం నుండి రవాణా సౌకర్యము కలదు. రోడ్డు రవాణా సంస్థవారి బస్సులతో పాటు ప్రైవేటు వాహనములు కూడా విస్తృతంగా నడవడం చేత ఈ క్షేత్రము చేరుట సులభము. పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదమునకు చెందిన క్షేత్రము కావుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చనము సుభాదాయకం అని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ మందలి శివలింగము కణ్వమహర్షి ద్వారా ప్రతిష్టితమైనట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆలయం రెండు శతాబ్దాల క్రితం నిర్మాణమైనట్లు తెలియుచున్నది. అంతేగాక మంటపం అరవై యేళ్ళ క్రితం పునఃనిర్మాణం జరిగింది. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ యాభై సంవత్సరముల క్రితం జరిగినట్లుగా అర్చకస్వామి తెలియజేశారు.
ఈ ఆలయంలో గణపతి పార్వతీదేవి మరియు చండీశ్వర ఉపాలయములు కలవు. గ్రామంలో ఈ ఆలయం కాక పురాతనమైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము, అన్నపూర్ణా సమేత త్రయంబకేశ్వర ఆలయము మరియు అభయాంజనేయ స్వామి ఆలయములు కలవు. కణ్వలింగేశ్వరస్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఈ సందర్భంలో స్వామివారికి ఐదు రకాల వాహనాలతో సేవ జరుతుతుంది. శరన్నవరాత్రులు కూడా ఈ క్షేత్రంలో ప్రసిద్ధి.