ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిలో కలదు. అందువల్ల కాకినాడ నుండి విశేషమైన రవాణా సౌకర్యం కలదు. చేరుట సులభము. ఈ క్షేత్రము పునర్వసు నక్షత్రము రెండవ పాదమునకు చెందినది. అందువల్ల ఈ జాతకులు కరప యందు వెలసిన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన శుభ ఫలితములు కలుగునని భక్తజనుల విశ్వాసము. ఈ ఆలయ చరిత్ర బహు పురాతనమైనది. స్వామి, శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్త అని కథనం. గత ఆలయము 1849వ ప్రాంతంలో నిర్మించబడినట్లుగా అక్కడి శిలాఫలకాలను బట్టి తెలుస్తోంది.
తదుపరి 1950వ సంవత్సరంలో జీర్ణాలయం పునరుద్ధరణ జరిగింది. తదుపరి అనేకమంది భక్తులు వారి వారి శ్రద్ధానుసారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పిఠాపురం రాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లుగా అర్చకస్వాముల కథనం. ఈ ఆలయమునకు ఉపాలయములుగా నవగ్రహ మంటపము, ఆంజనేయస్వామివారి ఆలయము కలవు. అంతేకాక పురాతనమైన విష్ణాలయం కూడా కలదు. స్వామివారి దివ్య కల్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు కూడా ఇక్కడ విశేషంగా నిర్వహించబడతాయి.