info@bheemasabha.com

శ్రీ ఉమా సమేత సోమేశ్వరస్వామివారి దేవస్థానం – కోలంక

భరణినక్షత్రం – ప్రథమ చరణంKolanka

ఈ క్షేత్రము యానాం ద్రాక్షారామ ప్రధాన రహదారిపై కోలంక గ్రామమున కలదు. ప్రధాన రహదారి నుండి సుమారు కిలోమీటరు లోపల ఈ ఆలయమునకు చేరవచ్చును. ఈ ఆలయము కేవలం నక్షత్ర శివాలయం మాత్రమే కాక అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయమును కోటిపల్లి – యానాం మార్గం ద్వారా చేరవచ్చును. రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం కలదు.

భరణి నక్షత్రము మొదటి పాదమున జన్మించినవారు ఈ ఆలయము సందర్శించి అచటి స్వామికి అర్చనాభిషేకములు చేసిన యెడల వారి విపత్తులు తీరి సంకల్పసిద్ధి కలుగుతుందని విశ్వాసము. ఈ క్షేత్రము పైన తెలిపినట్లు చంద్ర ప్రతిష్టితమైన అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా తూర్పుకోణమున కోలంక గ్రామంలో ప్రతిష్టించబడినది. ఇచ్చటి స్థలపురాణం ప్రకారం అనేక శతాబ్దాలుగా వున్న ఈ క్షేత్రము 9వ శతాబ్ద కాలంలో చాళుక్య భీమునిచే పునరుద్దరింపబడినట్లుగా తెలియుచున్నది. తదనంతరం పెద్దాపురం రాజుగారైన శ్రీవత్సవాయి తిమ్మజగపతిరాజుగారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారట. ఈ ఆలయమునకు చేర్చి కేశవస్వామివారి ఆలయము కలదు.

ఈ రెంటికీ మధ్య ఖాళీ స్థలములో క్రీ.శ.1986 సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులవారి దివ్య ఆశిస్సులతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ప్రతిష్ట, శ్రీ అట్లూరి సత్యనారాయణ రాజు, శ్రీమతి సత్యనారాయణమ్మ దంపతుల చేతులమీదుగా జరిగినది. తదుపరి 1999వ సంవత్సరములో ఆలయ పునరుద్ధరణ శివలింగ పునఃప్రతిష్టతో పాటు పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, నంది, ధ్వజస్తంభము ఇత్యాదుల పునఃప్రతిష్ట జరిగినది. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయము శ్రీవాణీ మాతాజీ సత్సంగము వారి ఆధ్వర్యంలో నిర్మింపబడి నిర్వహించబడుచున్నది. ఆలయము వెనుక భాగమున శ్రీవత్సవాయి తిమ్మజగపతిరాజుగారి పేరున వాహనశాల నిర్మాణం జరిగినది.

ఇచ్చట ఉమా సమేత సోమేశ్వరస్వామి వారికి మరియు శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా ఏకముహూర్తములో కళ్యాణోత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారికి ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి కళ్యాణోత్సవం జరుగుతుంది.