ఈ క్షేత్రం యానాం – కోటిపల్లి ప్రధాన రహదారిపైన కలదు. ఈ ఆలయం చేరుటకు అధికశ్రమ అవసరంలేదు. ప్రధానరహదారిపైన కుడివైపున ఉండుట వల్ల యానాం నుండి కోటిపల్లి వైపు వెళ్ళు బస్సుగాని, ఆటోగాని ఎక్కి ఇంజరం శివాలయం అని చెబితే సరిపోతుంది.భీమమండలంలో వేంచేసియున్న శ్రీ ఉమాసమేత కృపేశ్వరస్వామివారిని దర్శించుకోవడం సర్వపాపహరంగాను, సంపత్కరంగాను భావించడం జరుగుతున్నది, ముఖ్యంగా భరణి నక్షత్రం – ద్వితీయ చరణంలో జన్మించిన వారికి ఈ ఆలయస్థితి శివస్వరూపదర్శనం, అర్చనాభిషేకాదుల వలన విశేష ఫలం లభించగలదని భక్తజనుల విశ్వాసం.
ఈ ఆలయ నిర్మాణం సుమారు నాలుగు శతాబ్దములకు పూర్వం అక్కన్నమాదన్నల కాలంలోనే జరిగినట్లు తెలియుచున్నది. ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరులతో పాటు, నవగ్రహమంటపము కలవు, అంతేకాక ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారామస్వామివారి ఆలయం కలదు. శివాలయం ఎదురుగా ఆంజనేయస్వామివారు కొలువై వుండటం ఈ క్షేత్ర విశేషం. ఈ ఆలయానికి జేర్చి పురాతనమయిన మదనగోపాలస్వామివారి మందిరం గలదు. ఆలయ కుడ్యములపై ద్వాదశ జ్యోతిర్లింగములు, మరియు నవదుర్గల చిత్రములు అందంగా చెక్కబడియున్నవి. ఆలయప్రాంగణంలో ధ్యానముద్రలో యున్న శివుని విగ్రహం కన్నుల పండుగగా దర్శనమిచ్చును.