ఈ క్షేత్రము తనుమళ్ళకు సమీపంగా వున్నను కాజులూరు నుండి లేదా దుగ్గుదూరు నుండి పక్కా రోడ్డు సౌకర్యం వుండడం చేత ఆ గ్రామము నుండి అయితపూడి చేరుట సులభము. అయితే ఈ గ్రామమునకు ప్రత్యేకించి రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యము లేదు. అందువల్ల ప్రయివేటు వాహనముల (ఆటో) ద్వారా చేరవచ్చును. రోహిణి నక్షత్రము మూడవపాదంలో జన్మించిన వారికి ఈ క్షేత్ర స్థిత శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామివారి దర్శనము, అర్చనాభిషేకాదులు శుభ ప్రదమని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్ర స్థిత లింగమూర్తి శ్రీరామచంద్ర ప్రతిష్టగా కథనం. శ్రీరామచంద్రమూర్తి సంధ్యావందనానంతరం ఇచట సైకతలింగ ప్రతిష్ఠగావించి అర్చించినట్లుగా కథనం.
ఈ ఆలయమునకు సుమారు మూడు శతాబ్ధముల చరిత్ర కలదు. 2005వ సంవత్సరములో ఈ ఆలయ పునర్నిర్మాణము జరిగినది. ప్రస్తుత ఆలయ ముఖద్వారముపై పరమశివుడు జ్ఞానముద్రలో వున్నట్లు శిల్పీకరించబడినది. అలాగే మంటపముపై గణపతి, అయ్యప్ప ఇత్యాది మూర్తులు గలవు. ఈ ఆలయమునకు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మరియు చండీశ్వరుల ఉపాలయములు వున్నవి. గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారి ఆలయము కూడా కలదు.స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇంకనూ ఈ ఆలయమున శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవములు జరుగును.