ఈ క్షేత్రము ప్రసిద్ధ అయినవిల్లి క్షేత్రమునకు సమీపమున కలదు. రాజమండ్రి నుండి మురమళ్ళ, ముక్తేశ్వరం వెళ్ళు బస్సులు ఈ క్షేత్రం గుండా వెళ్ళును. ప్రైవేటు వాహన సౌకర్యం కూడా ఉండును. చేరుట సులభము.
ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో శ్రవణం నక్షత్రం రెండవ పాదానికి చెందినది. ఈ జాతకులు మడిపల్లి యందు కోలువైయున్న శ్రీ పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.
ప్రస్తుత ఆలయం సుమారు రెండువందల సంవత్సరముల పూర్వము ఓలేటి వంశజులచే నిర్మించబడినది. అంతరాలయంలో గణపతి కొలువై వున్నారు. ఇంకా ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయం, రామాలయం, కనకదుర్గ ఆలయం మరియు మహాలక్ష్మీ ఆలయం కలదు.
స్వామివారి కళ్యాణోత్సవము వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా నిర్వహించబడుతుంది. శరన్నవరాత్రులు ఈ క్షేత్రంలో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ అతి ముఖ్యమైన ఉత్సవం కనుమరోజున జరిగే ప్రభల ఉత్సవం.